హైదరాబాదులో పుస్తక ప్రదర్శనను నిర్వహించాలని 1985లో హైదరాబాదులోని ప్రముఖ ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలతో, హైదరాబాదు బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పడి, మొదటి హైదరాబాదు బుక్ ఫెయిర్ను అశోక్ నగర్ లోని సిటీ గ్రంథాలయ సంస్థలో నిర్వహించింది. మొదటి ప్రదర్శనకు పాఠకులనుండి, ప్రజలనుండి ఎంతో ఆదరణ లభించింది. తరువాతి హైదరాబాదు బుక్ ఫెయిర్ లను నిజాం కాలేజి గ్రౌండ్స్, పబ్లిక గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కెశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్ లలోను, గత రెండు సంపత్సరాల నుండి పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్, నెక్లెస్ రోడ్డులోను నిర్వహించాము. స్పందన బాగుండటంతో ఈ సంవత్సరం కూడా అదే స్థలంలో నిర్వహించాలని భావించాము.
ఈ విధంగా ఇప్పటికి 22 ప్రదర్శనలను నిర్వహించాము. విద్యార్థులలోనూ, పాఠకులలోను పఠనాసక్తిని పెంచి, వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలనేదే హైదరాబాదు బుక్ ఫెయిర్ లక్ష్యం.
23వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిశంబర్ 18 నుండి ప్రారంభంకానుంది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన భారతదేశంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలలో కలకత్తా బుక్ ఫెయిర్ తర్వాత నాణ్యమైనదిగా పేరొందింది. రాష్ట్రంలో ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలే కాక దేశంలోని సుప్రసిద్ద ప్రచురణకర్తలెందరో ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, సేజ్, పెంగ్విన్, ఓరియంట్ బ్లాక్స స్వాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఈ ప్రదర్శనలో 180 స్టాల్స్ దాకా ఉన్నాయి. అందులో 10 స్టాల్స్ ప్రముఖ దినపత్రికలకు కేటాయించాము. 110 స్టాల్స్ లో ఇంగ్లీషు పుస్తకాలు, 50 స్టాల్స్ లో తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఇంకా హిందీ, ఉర్దూ భాషలలో కూడా పుస్తకాల స్టాల్స్ ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థలయిన నేషనల్ బుక్ ఇండియా, కెంద్ర సాహిత్య అకాడమీ, పబ్లికేషన్ డివిజన్, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ప్రదర్శనలో ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బొంబాయి, విజయవాడకు చెందిన ప్రముఖ పబ్లిషర్లందరూ పాల్గొంటున్నారు. పుస్తకాలతో పాటుగా వైజ్ఞానిక సంబంధమయిన సీ.డీ.లు కూడా ప్రదర్శనలో లభ్యమవుతాయి.
ఈ ప్రదర్శనలో పురాణ సాహిత్యం, నవలలు, కథలు, పిల్లల పుస్తకాలు, విద్యార్థుల పుస్తకాలు విద్యా సంబంధమయిన పుస్తకాలు పాఠ్య పుస్తకాలు, ఇంజినీరింగ్, మెడికల్ పుస్తకాలు, అభ్యుదయ సాహిత్యం కాల్పనిక సాహిత్యం, కే.జి నుండి పి.జి వరకు అన్ని వయసుల వారికి, అన్ని రంగాల వారికి అవసరమైన పుస్తకాలను ఈ ప్రదర్శనలోఉంచుతున్నాము.
ఈ ప్రదర్శన డిశంబరు 18 వతేదీ సాయంత్రం ప్రారంభమౌతుంది. డిశంబరు 28 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటలనుండి సాయంత్రం 9.00 గంటలవరకు సందర్శించవచ్చు. ప్రదర్శనలో కొనుగోలు దారులకు 10% డిస్కౌంటు ఇస్తారు. ఈ ప్రదర్శనలో సొంతంగా పుస్తకాలు ప్రచురించిన రచయితలను ప్రోత్సహించటానికి రైటర్ హాల్ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. అసక్తి వున్న రచయితలందరూ డిశంబర్ 15వ తేదీలోగా నూరు రూపాయలు రిజిష్ట్రేషన్ రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి. వారికి రైటర్స్ హాల్లో ఒక షెల్ఫ్ కేటాయిస్తాము.
పుస్తక ప్రదర్శన ప్రవేశ రుసుము 5 రూపాయలు. దాదాపు లక్ష వరకు ఫ్రీ పాసులను విద్యా సంస్థలకు, ప్రముఖులకు, రచయితలకు, సంస్థలకు పంపాము. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, తమ గుర్తింపు కార్డు చూపించడం ద్వారా ప్రదర్శనకు ఉచితంగా ప్రవేశం పొందవచ్చును.
తెలుగు భాషకు ప్రాచీనహోదా కల్పించిన నేపథ్యంలో తెలుగు భాష, సంస్కృతులను పరిరక్షించడానికి సైనికున్నా పనిచెసిన, వివిధ రంగాలలో కృషి చేసిన యోధులను హైదరాబాద్ పుస్తక ప్రదర్శన వేదికగా గౌరవించాలని భావిస్తున్నాము. తెలుగు భాష ప్రాభవాన్ని తెలియజెప్పే వివిధ రకాల సదస్సులు, గోష్టులు, పుస్తకావిష్కరణ సభలు నిర్వహించనున్నాము.
విద్యార్థులు, మేధావులు, రచయితలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక ప్రియులందరిని కోరుతున్నాము. డిశంబర్ 18 నుండి 28 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కు ఆదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఆభివందనలతో
ఆర్. హనుమంతరావు
సెక్రటరీ
యస్. శ్రీనివాసరావు
ప్రెసిడెంట్
